Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : - *తెలుగు విభాగంలో ఆకట్టుకున్న కవి సమ్మేళనం* - - *పద్య పఠనం, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం* శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ - ఈతరం కవితా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోలాట ప్రదర్శనను ఎస్ వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధారాణి, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ జిఎం సుందరవల్లి ప్రారంభించారు. ఎంఏ తెలుగు పూర్వ విద్యార్థి వెంకటేష్ నేతృత్వంలో కోలాట ప్రదర్శన అద్వితీయంగా నిర్వహించారు. భక్తి గీతాలతో కోలాట దర్శన అందర్నీ అలరించింది. కోలాట ప్రదర్శనలో డప్పు పై చక్రవర్తి, తబలాపై వెంకటరమణారెడ్డి వాద్య సహకారం అందించారు. అందరికీ ఉగాది పచ్చడి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తెలుగు విభాగంలోని ఆచార్య జియన్ రెడ్డి సెమినార్ హాల్లో ఉగాది వేడుకలు చేపట్టారు. ఇటీవల కన్నుమూసిన ఎస్వీయూ తెలుగు విశ్రాంతాచార్యులు జక్కంపూడి మునిరత్నం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. తెలుగు విభాగంలో పరిశోధకులుగా, అధ్యాపకులుగా ఆచార్య జక్కంపూడి మునిరత్నం ఎంతో కృషి చేశారని తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ రాజేశ్వరమ్మ కొనియాడారు. ఈతరం కవితా వేదిక గౌరవాధ్యక్షులు, ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్జీడి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రకృతికీ మనిషికీ గల అనుబంధాన్ని గుర్తుచేసేది ఉగాది పండుగ అని తెలిపారు. ప్రతి ఉగాదికి కవి సమ్మేళనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఈతరం కవితా వేదిక అధ్యక్షులు తోట వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ తరం యువత మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఉగాది పండుగ వసంత రుతువునూ, కోయిల పాటలను తెస్తుందన్నారు. దూబగుంట రామకృష్ణ, ఆకుల మల్లేశ్వరరావు, రెడ్డిపల్లి షాజహాన్, రవితో పాటు సుమారు 20 మంది కవులు కవితా పఠనం చేశారు. ఇందులో కె. శృతి, విద్య, బాలకృష్ణ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. ఈ కవి సమ్మేళనానికి న్యాయ నిర్ణీతలుగా ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. విజేతలకు సర్టిఫికెట్లు, పుస్తక బహుమతులను అందజేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా చేపట్టిన పద్య పఠనం, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పుస్తక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్లు కోసూరు దామోదర్ నాయుడు, కె. మునిరత్నం, కాటూరి శారద, హెచ్ఎస్ సౌభాగ్యమ్మ, గెస్ట్ ఫ్యాకల్టీ సునీల్ కుమార్, అశోక్, ఆదిశేషయ్య, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV