Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలపై నిరంతర అవగాహన కల్పించాలి.. పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.. మదనపల్లి/పుంగనూరు/చౌడేపల్లి: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది అత్యంత గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలని, వారి సమస్యలను తక్షణమే పరిశీలించి చట్టపరిధిలో సత్వర న్యాయం అందించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారు ఆదేశించారు. బుధవారం ఆయన అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారితో కలిసి పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ల పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేర నియంత్రణ చర్యలపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించిన ఉన్నతాధికారులు.. పెండింగ్ కేసుల వివరాలను, స్టేషన్ పరిధిలోని నేరాల తీరును ఆరా తీశారు. పుంగనూరు పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్, లాకప్ గదులు, రైటర్ రూమ్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు, కార్యాలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నేరాలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. *ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి..* సమాజంలో పెరుగుతున్న నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రతివారం మహిళా పోలీసుల సమన్వయంతో పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రధానంగా మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, మహిళలపై అఘాయిత్యాలు, ఆన్లైన్ మోసాలు, వైట్ కాలర్ నేరాలు, సైబర్ క్రైమ్పై ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు. ఆపద సమయంలో మహిళల భద్రత కోసం రూపొందించిన 'శక్తి యాప్' ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. *సీసీ కెమెరాలే కీలకం..* నేరాల నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు, వ్యాపారస్తులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే, అధికారులు, మహిళా పోలీసులు సమన్వయంతో పనిచేసి రాబోయే 'లోక్ అదాలత్'లో అత్యధిక కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యేలా చూడాలని, పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ శ్రీమతి బి. పావని, పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్, పుంగనూరు ఎస్ఐలు అన్సర్ బాషా, రమణ, చౌడేపల్లి ఎస్ఐ చిన్నరెడ్డప్ప తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV