Famous TV - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం జగన్, నూతన న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, తదితరులు హాజరయ్యారు.. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కేంద్ర న్యాయశాఖ వీరి నియామకానికి ఈనెల 18న ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులకుగానూ ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన నలుగురితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.
Admin
Famous TV