Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సంక్షేమ వసతి గృహ అధికారులు వారి వసతి గృహం దగ్గరలో నివాసం ఉండాలి.సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలు చేయబడుతున్న వివిధ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూతన మెనూను సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు మేరుగ నాగార్జున సంబంధిత అధికారులతో అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక పద్మావతి అతిథి గృహం తిరుపతి నందు చిత్తూరు, తిరుపతి జిల్లాల సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, ఈడి ఎస్సీ కార్పొరేషన్, జిల్లా కోఆర్డినేటర్ గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ లతో మంత్రివర్యులు సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీలకు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు సాంఘిక సంక్షేమ అధికారుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాల నిర్వహణ, పరీక్ష ఫలితాలపై, కళాశాలల హాస్టల్ ల నిర్వహణ మొదలైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశలో ఇప్పటినుండే ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని సంక్షేమ అధికారులకు సూచించారు. కళాశాలల వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వసతి గృహ అధికారులు వారి వసతి గృహం వద్దనే నివాసం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నూతన మెనూను సక్రమంగా అమలు చేయాలని అధికారులు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కళాశాలల వసతి గృహాల లోని కళాశాల విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగేలా పోలీసుల సహకారంతో కౌన్సిలింగ్ నిర్వహించి వారు పెడదారిన పట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారులు చెన్నయ్య, రాజ్యలక్ష్మి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ నర్సింహులు, జిల్లా కోఆర్డినేటర్ గురుకుల పాఠశాలలు జయభారతి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
Famous TV