Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : తిరిపతి నగరపాలక సంస్థ పరిధిలో పునః ప్రారంభానికి సిద్దం చేస్తున్న అన్నా క్యాంటీన్ల పనులు ఆగస్ట్ 5 లోపు పూర్తి చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం తెల్లవారుజామున రాజన్న పార్కు సమీపంలోని మస్టర్ గది వద్ద ఉద్యోగుల హాజరు నమోదును కమిషనర్ పరిశీలించారు. అందరూ టైం ప్రకారం విధులకు హాజరు కావాలని, పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్వీమ్స్ కూడలి, న్యూ బాలాజీ కాలని, ముత్యాల రెడ్డి పల్లి, ఇఎస్ఐ హాస్పిటల్ వద్ద గల అన్నా క్యాంటీన్ల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వినాయకసాగర్ వద్ద గల 5 ఎం.ఎల్.డి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులు మురుగునీరు శుద్ధి చేసే విధానాన్ని వివరించారు. అనంతరం వినాయక సాగర్ ను సందర్శించి వాకర్స్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 5 లోపు అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం సూచనల మేరకు అన్ని హంగులతో సిద్దం చేయాలని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని ఆగస్టు 15వ తేది అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరగాలని ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. నగరంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. వినాయకసాగర్ లో మరుగుదొడ్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలని అన్నారు. సాగర్ లో పారిశుద్ధ్యం సరిగా లేదని వెంటనే శుభ్రం చేయాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డి.ఈ లు మహేష్, శ్రావణి, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV