Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అధికారం అండతో అక్రమంగా కబ్జాకు ప్రయత్నం, వెనక ఉన్నది ఎవరు? – అద్దె మనుషుల దాడులకు యత్నం – కోర్టులో ఉన్న స్థలంలో చదును ఎలా చేస్తారంటూ నిలదీత మదనపల్లి : అన్నమయ్యజిల్లా కేంద్రంగా మదనపల్లె ఏర్పాటు జరిగినప్పటి నుంచీ పేదల భూములు కాజేసేందుకు గద్దలు తయారయ్యాయి.పట్టణ నడిబొడ్డున,పట్టపగలు ఏమాత్రం జంకు,భయం లేకుండా పేద దళితులకు చెందిన కోట్ల విలువైన భూమిని దర్జాగా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు.అద్దె మనుషులు కొంతమందిని స్థలం వద్దకు పంపి,రికార్డులు,స్థలానికి సంబంధించిన పత్రాలు లేకుండానే రాజకీయ అండతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు.ఏకంగా జేసీబీ తీసుకువచ్చి స్థలం చదును చేయడంతో భూ యజమానులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్న పెయిడ్ బ్యాచ్... మళ్లీ సాయంత్రం మరోసారి కబ్జా చేసేందుకు స్థలం వద్దకు చేరుకున్నారు.దీంతో పెద్దసంఖ్యలో భూయజమానులు, తమ మద్దతుదారులతో కలిసి వారి ప్రయత్నాలను సాగనీయకుండా అడ్డుకోవడంతో తోక ముడిచి అక్కడి నుంచి పరారయ్యారు.ఈ సందర్భంగా భూ యజమానులు కొండుపల్లె వెంకటరమణ,రామచంద్ర, సుబ్రహ్మణ్యం,దివాకర్ మాట్లాడుతూ.... బీకే.పల్లె పంచాయతీ గొల్లపల్లె బైపాస్ రోడ్డులోని అక్షయ హోటల్ ఎదురుగా సర్వేనెం.509/4లో 5.26 ఎకరాలు భూమి తమ తాతల కాలం నుంచి వారసత్వంగా తమకు సంక్రమించిదన్నారు.పట్టాభూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తమ భూమిని అప్పటి రెవెన్యూ అధికారులతో కలిసి విద్యుత్శాఖ యూనియన్ కార్యదర్శిగా చెప్పుకునే చిన్నప్ప... డీకేటీ భూమిగా రికార్డులు ట్యాంపరింగ్ చేశాడన్నారు.ఈ విషయమై ఆర్డీఓ కోర్టులో విచారణ జరిగి అప్పటి ఆర్డీఓ శివారెడ్డి ఆర్ఓఆర్ రద్దు చేశారన్నారు.మనుగడలో లేని యూనియన్ పేరుతో భూమిని అగ్రిమెంట్ చేయించుకుని తన అనుచరులతో కలిసి భూదందాలకు పాల్పడుతూ అక్రమార్జనకు పాల్పడ్డారన్నారు.తాము ఈ విషయమై రామకృష్ణారెడ్డి ద్వారా కోర్టుకు వెళ్లడంతో భూమి తనకు దక్కదన్న ఆలోచనతో అధికార బలం,రాజకీయ అండ చూసుకుని అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు.తమ భూమిపై జేసీ కోర్టులో విచారణ జరుగుతోందని, అదే విధంగా హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్లు..10304, 10306/2023 సంవత్సరంలోనూ, 14658/2024లోనూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు.ఈకేసుల్లో స్టేటస్ కో ఆర్డర్ అమల్లో ఉందన్నారు.అదేవిధంగా 2015లో ఎగ్జిక్యూటివ్ పిటిషన్ 44 నెంబర్తో కేసు విచారణలో ఉందన్నారు.అదేవిధంగా హైకోర్టులో 4791, 4860, 4895/2016లో సీఆర్పీ కేసులు దాఖలు చేయడం జరిగిందన్నారు.ఈ కేసులపై చిన్నప్ప అప్పీలుకు వెళ్లగా, కోర్టు డిస్మిస్ చేసిందన్నారు.అంతేకాకుండా 2010లో విద్యుత్శాఖకు సంబంధించిన అనుమతులు పూర్తిగా ఆర్డీఓ రద్దు చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ అధికారులు సైతం యూనియన్ తీర్మానాన్ని తిరస్కరించడం జరిగిందన్నారు.ఇదిలా ఉండగా,సోమవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీని తీసుకువచ్చి భూమిని చదును చేసేందుకు ప్రయత్నించారన్నారు.దీంతో తాము అక్కడకు చేరుకుని భూమికి సంబంధించి మీ వద్ద ఉన్న రికార్డులు చూపాలని కోరడంతో వాళ్లు చూపకపోగా,పైపెచ్చు తమపైనే దౌర్జన్యానికి దిగారన్నారు.మీకు ఈ స్థలానికి ఏమి సంబంధం. కోర్టులో నడుస్తున్న కేసులో మీరు ప్రతివాదులు కారు.మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో...మేము భూమి చదును చేయడం ఆపేదిలేదు.కావాలంటే మీరు పోలీసులకు ఫోన్ చేసుకోండి.లేదా మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడి దాడికి యత్నించారు.దీంతో భూయజమానులు జేసీబీకి అడ్డుపడి కదలనీయకుండా కూర్చోవడం,డయల్ 100కు ఫోన్చేసి పోలీసులకు సమాచారం తెలపడంతో పోలీసులు వచ్చారన్నారు.వారిని చూడగానే పెయిడ్ బ్యాచ్ ఉన్నపళంగా భూమిలో నుంచి వెళ్లిపోయారన్నారు.కోట్ల విలువ చేసే దళితుల భూమిని ఆక్రమించుకునేందుకు పట్టణంలోని కొందరు అధికార పార్టీ నాయకులు రాజకీయ అండతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంపై అన్నమయ్యజిల్లా ఎస్పీ కార్యాలయం,టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశామన్నారు.ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్,మంత్రి నారాలోకేష్,డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు ఫిర్యాదుచేస్తామన్నారు.
Admin
Famous TV