Famous TV - క్రైమ్ వార్తలు / పశ్చిమ గోదావరి : * - మృతుల కుటుంబాలను ఆదుకోవాలి, ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి - బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ - మార్చి 2న ప్రమాద స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులకు పరామర్శించి, మృతులకు నివాళులర్పించనున్న రామచంద్రయాదవ్ మంగళగిరి: కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం, వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం జరిగిన భారీ పేలుడు ఘటనపై భారతచైతన్య యువజన (బిసివై) పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం, అనేకమంది తీవ్రంగా గాయపడటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. పండుగల కోసం వెలుగులు పంచే టపాసుల తయారీ వెనుక ఇంతటి చీకటి విషాదం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోడె రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, పొట్టకూటి కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న నిరుపేద కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం, సంబంధిత ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించని యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి, ప్రమాదానికి కారణమైన బాణసంచా తయారీ కేంద్రం యాజమాన్యంపై, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో విఫలమైన సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం కేవలం మొక్కుబడి చర్యలతో సరిపెట్టకుండా, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బాణసంచా తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించి, కఠినమైన, శాశ్వతమైన చర్యలు తీసుకోవాలని బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో, రాబోయే సోమవారం, మార్చి 2వ తేదీన, బోడె రామచంద్రయాదవ్ స్వయంగా కాకినాడ వెళ్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారని, ప్రమాద స్థలాన్ని సందర్శించి మృతులకు నివాళులర్పిస్తారని, వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదారుస్తారని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Admin
Famous TV