Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : సూర్య రాక్స్ లీజ్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు... లీజుదారులకు అనుకూలంగా ఆదేశాలు... చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమకులపల్లి గ్రామంలోని సర్వే నెం. 559/18లో 2.88 హెక్టార్లలో గ్రానైట్ మైనింగ్ లీజు 2007లో గుత్తా హరికృష్ణ కు చెందిన సూర్యా రాక్స్ కి 20 ఏళ్లపాటు మంజూరైంది. అయితే ఈ ప్రాంతం బోయకొండ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఉందా లేదా అనేదే ప్రధాన వివాదంగా మారింది. లీజు పొందిన వారు టీడీపీ సానుభూతి పరులు అనే ఉద్దేశంతో రాజకీయ ఒత్తిడితో అటవీ అధికారులు రికార్డులు తారుమారు చేసి మరీ లీజు రద్దుకు.. కేసుల నమోదుకు ప్రయత్నించారు. 2019 డిసెంబర్లో జరిపిన సర్వేలో పిటిషనర్ స్వాధీనంలోని ప్రాంతం రిజర్వు ఫారెస్ట్లో ఉన్నట్లు గుర్తించడంతో ఫారెస్ట్ ఆఫెన్స్ కేసు (OR నెం. 39/2020-21/PGR) నమోదైంది. ఈ కేసును సవాల్ చేస్తూ 2020లో దాఖలైన రిట్ పిటిషన్ (W.P. నెం. 12585/2020)లో అరెస్టుకు స్టే ఇవ్వడం, అనంతరం 2022లో రవాణా అనుమతుల కోసం దాఖలైన మరో పిటిషన్ (W.P. నెం. 2606/2022)లో లీజు ప్రాంతం వెలుపల మైనింగ్ జరగలేదని పేర్కొంటూ పిటిషనర్కు అనుకూలంగా ఉత్తర్వులు రావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా, అత్యంత కీలకమైన జాయింట్ సర్వే కమిటీ నివేదిక (12-09-2025)లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో ఫారెస్ట్, రెవెన్యూ, సర్వే, మైన్స్ & జియాలజీ, విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ (V&E) శాఖల అధికారులు పాల్గొన్నారు. కైర్న్ (సరిహద్దు గుర్తు) నెం. 54 నుంచి చేసిన సర్వేలో, పిటిషనర్ ఆక్రమించిన ప్రాంతం సెక్షన్ 15 కింద 1981నాటి గెజిట్ నోటిఫికేషన్ నెంబర్ 249 ఫారెస్ట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రకారం బోయకొండ ఆర్ఎఫ్ సరిహద్దు రేఖకు 436 మీటర్ల దూరంలో (వెలుపల) ఉన్నట్లు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇదే నివేదికలో మరో కీలక విషయం వెలుగుచూసింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతానికి, ప్రస్తుతం సర్వేలో తేలిన ప్రాంతానికి పెద్ద ఎత్తున తేడా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. సెక్షన్ 15 నోటిఫికేషన్ ప్రకారం 2613.30 హెక్టార్లుగా నమోదైన బోయకొండ బ్లాక్ విస్తీర్ణం, సర్వేలో 1117.98 హెక్టార్లు అధికంగా (మొత్తం 3731.28 హెక్టార్లు) ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల పట్టా/డీకేటీ పట్టా భూములు కూడా ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని, 2018-19లోనే జరిపిన సర్వేలో కూడా ఈ అంశాన్ని గుర్తించి, అసలు నోటిఫైడ్ ఏరియా (2613.30 హెక్టార్లు) నుంచి వైదొలగకుండా బోయకొండ బ్లాక్ను మొత్తం పునర్నోటిఫికేషన్ చేయాలని సిఫార్సు చేసినట్లు నివేదిక పేర్కొంది. దీనిపై ప్రధాన అటవీ సంరక్షకుడు (పీసీసీఎఫ్) ఆదేశాల మేరకు, బోయకొండ ఆర్ఎఫ్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి, నేలపై ఉన్న ఫారెస్ట్ ప్రాంతాన్ని రక్షించడానికి ఎరేటా (దిద్దుబాటు) ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపింది. సర్వే నివేదికలు, వాటిలో వెల్లడైన అంశాలు, పిటిషనర్ మైనింగ్ లీజు ప్రాంతం ఫారెస్ట్ పరిధి వెలుపల ఉన్నట్లు నిర్ధారణ కావడం, అదే సమయంలో మొత్తం బోయకొండ ఫారెస్ట్ బ్లాక్ సరిహద్దులపైనే పెద్ద ఎత్తున వివాదం వెలుగుచూడటం ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని స్పష్టం చేస్తోంది.
Admin
Famous TV