Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శ్రీసిటీ, ఫిబ్రవరి 27, 2024: బాలికలు రుతుక్రమం సమయంలో ఎదుర్కునే సమస్యలను పరిష్కరించడానికి ‘కౌమార బాలికల వ్యక్తిగత పరిశుభ్రత’ అనే అంశంపై సూళ్లూరుపేటలోని ఎపిఎస్డబ్ల్యు రెసిడెన్షియల్ స్కూల్లో మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఆరోగ్యం, పరిశుభ్రత ఉత్పత్తుల తయారీ అగ్రగామి పరిశ్రమ యూనిచార్మ్, శ్రీసిటీ ఫౌండేషన్ సహకారంతో మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీసిటీ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీమతి నిరీషా సన్నారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాఠశాల బాలికలకు తగినంత అవగాహన లేకపోవడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బహిష్టు పరిశుభ్రత ఉత్పత్తులు సరిగ్గా అందుబాటులో లేకపోవడం కారణంగా పాఠశాలలకు బాలికల గైర్హాజరు, డ్రాపౌట్లకు దారితీస్తున్నాయని, ఆ సవాళ్లకు దారి చూపడమే ఈ సదస్సు ఉద్ద్యేశ్యం అన్నారు. సదస్సులో యునిచార్మ్ CSR వింగ్ నిపుణులు శ్రీమతి అంకిత మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ఋతుక్రమణ పరిశుభ్రత పద్ధతులను గురించి వివరించడంతో పాటు విద్యార్థినులకు పలు విలువైన సూచనలు అందించారు. అలాగే కౌమారదశలో ఉన్న బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించడంలో యూనిఛార్మ్ సంస్థ నిబద్ధతను స్పష్టం చేశారు. మన సంస్కృతి సేవా ట్రస్ట్కి చెందిన శ్రీమతి తేజోవతి కూడా సదస్సులో ప్రసంగించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరించిన మన సంస్కృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్. కె.హరినాధ రెడ్డి, దీనికి సహాయ సహకారాలు అందించిన యునిచార్మ్ మరియు శ్రీసిటీ ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సూళూరుపేటలోని APSW రెసిడెన్షియల్ స్కూల్, బిసి బాలికల హాస్టల్, తడలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి) కు చెందిన 1100 మంది బాలికలకు Unicharm సంస్థ శానిటరీ నాప్కిన్ ప్యాక్లను పంపిణీ చేసింది. త్వరలో సత్యవేడు ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇదే తరహా సదస్సు నిర్వహించి, శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయనున్నారు. తద్వారా మరో 500 మంది బాలికలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందుకోసం సుమారు 2 లక్షల రూపాయలు కంపెనీ ఖర్చు చేసింది.
Admin
Famous TV