Famous TV - భక్తి / తిరుపతి : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా టీటీడీ పుష్ప-ఫోటో ప్రదర్శనను ఆకర్షణీయంగా ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా, టీటీడీ గార్డెన్ విభాగం హిందూ పురాణాలలోని అపురూప ఘట్టాలతో పాటు ద్రౌపదీ వస్త్రాపహరణం, వసుదేవుడు చిన్ని కృష్ణుని కావేరి నది దాటిస్తున్న సన్నివేశం, గజేంద్రమోక్షం, బకాసురుడు, ఘటోత్కజుడు(మాయాబజార్), మహాభారతంలో అర్జునుడు బృహన్న వలె వేషధారణ పొంది ఉత్తర కుమాడితో ఉన్న సన్నివేశాలు ప్రత్యేకంగా నిలిచాయి.
గత దశాబ్ద కాలంగా విజయవాడకు చెందిన ప్రముఖ కళాకారులు శ్రీ కృష్ణ కూరగాయలు, ఐస్, నవ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలైన వాటితో దేవతామూర్తుల ఆకృతులను చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా బెల్ పెప్పర్స్, వంకాయలు, ముల్లంగి, చెర్రీ టొమాటోలతో అలంకరించబడిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని రూపొందించారు. నవధాన్యాలలో శ్రీరాముడు, ఆంజనేయ స్వామి వారిని చిత్రించారు. కాగా, రావణుడు జటాయువును వధించడం, లవ-కుశ, శ్రీరామ జననం, మోహిని-భస్మాసుర, భీమసేన-బకాసుర, తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామితో పాటు అనంతాళ్వార్ సన్నివేశాలు భక్తులను విశేషంగా ఆకర్షించనున్నాయి.
టీటీడీ ఫోటో ఎగ్జిబిషన్ లో ఈ ఏడాది అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలు, వాహన సేవల సమయంలో యాత్రికుల భావోద్వేగాలు, టీటీడీ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను ప్రదర్శనలో ఉంచింది. అదేవిధంగా శేషాచల అడవులలో నెలకొని ఉన్న తిరుమల ఆలయ అద్భుత దృశ్యాలను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. టీటీడీ సాంప్రదాయ శిల్పకళాశాల వారిచే రాయి, సిమెంట్, స్టీల్, కలప మరియు పెయింటింగ్ లతో రూపొందించిన శిల్పాలు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇందులో ఉన్నాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్ప - ఫోటో ప్రదర్శన మరింత ఆధ్యాత్మిక శోభను ఇవ్వనున్నాయి.
Admin
Famous TV