Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల, 2023 ఆగస్టు 13: చిన్నారులపై క్రూరమృగాల దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి నుండి గాలిగోపురం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలు కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో శనివారం రాత్రి చిరుతల సంచారం కనిపించింది. ఈ నేపథ్యంలో 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులను ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఆదివారం నుండే ఈ నిర్ణయం అమలవుతోంది. అదేవిధంగా రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది. కాలినడక మార్గాలు, ఘాట్లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. క్రూరమృగాల సమస్య పరిష్కారమయ్యే వరకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది.
Admin
Famous TV